
పులివెందుల అర్బన్ మన జనప్రగతి ఏప్రిల్ 01:
పులివెందుల పట్టణంలోని రేషన్ పంపిణీ వ్యవస్థపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగా రేషన్ డీలర్లు అక్రమాలకు పాల్పడుతున్నారని, లబ్ధిదారులకు అందాల్సిన కోటాను భారీగా తగ్గిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పట్టణంలోని రాజారెడ్డి కాలనీకి చెందిన 18వ నంబర్ రేషన్ షాప్ డీలర్ అప్పస్వామిపై లబ్ధిదారులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక్కో కుటుంబానికి రావాల్సిన బియ్యం కంటే 5 నుండి 7 కిలోలు తక్కువగా ఇస్తున్నారని వారు ఆరోపించారు.20 కిలోల బియ్యం ఇవ్వాల్సి ఉండగా, కేవలం 13 నుండి 14 కిలోలు మాత్రమే ఇస్తున్నారని బాధితులు వాపోతున్నారు.
తక్కువ బియ్యం ఇస్తున్నారని ప్రశ్నించిన లబ్ధిదారులను డీలర్ కులం పేరుతో దూషిస్తూ, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి ఇచ్చేది ఇంతే అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఆందోళనలో పాల్గొన్న మాదాసు యువ రాజు అనే లబ్ధిదారుడు మాట్లాడుతూ,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు నారా లోకేష్లకు తమ సమస్యను విన్నవించారు.పందికొక్కుల్లా రేషన్ బియ్యాన్ని మెక్కుతున్న డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
ప్రభుత్వం సరఫరా చేస్తున్న గోధుమపిండి,జొన్నలు, రాగులు వంటివి పంపిణీ ప్రారంభించిన కొద్దిసేపటికే అయిపోయాయి అని డీలర్ అబద్ధాలు చెప్తున్నారని బాధితులు ఆరోపించారు.
తూకంలో మోసం చేసేందుకు ఇనుప డబ్బాలను వినియోగిస్తున్నారని,దీనివల్ల పేద ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని మహిళా లబ్ధిదారులు పేర్కొన్నారు.
తమకు న్యాయం చేయాలని, పూర్తి స్థాయిలో రేషన్ సరుకులు అందేలా చూడాలని కోరుతూ లబ్ధిదారులు రేషన్ షాప్ ఎదుట ఆందోళన నిర్వహించారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సదరు డీలర్పై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని పులివెందుల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.




