
వైసీపీ పాలనలో అన్ని శాఖలకు తాళాలు వేశార
– గత ఐదేళ్లు రాష్ట్రం అస్తవ్యస్తంగా మారింది
– పశుసంవర్ధక శాఖను నిర్వీర్యం చేసిన వైసీపీ
– పశువైద్యశాలలు పేరుకే మిగిలాయి, మందులు,పరికరాలు లేవు ,సిబ్బంది లేరు
– కూటమి ప్రభుత్వం వచ్చాకే పశుసంవర్ధక శాఖ పునరుజ్జీవనానికి చర్యలు : వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడ
అమరావతి మన జనప్రగతి, ఫిబ్రవరి 24:-గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలోని అన్ని శాఖలకు తాళాలు వేసిన పరిస్థితి నెలకొందని, ముఖ్యంగా పశుసంవర్ధక శాఖను పూర్తిగా నిర్వీర్యం చేసి అభివృద్ధిని కుంటుపెట్టారని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మంగళవారం అసెంబ్లీలో తీవ్ర విమర్శలు చేశారు. శాసనసభలో ఎమ్మెల్యేలు పశు వైద్యశాలల్లో సౌకర్యాల కొరత, వైద్యుల నియామకాలపై అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ వైసీపీ హయాంలో పశుసంవర్ధక శాఖలో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని, రైతులు, పశుపాలకులకు అవసరమైన కనీస మౌలిక సదుపాయాలు కూడా అందించలేని దుస్థితి ఏర్పడిందని మంత్రి తెలిపారు. పశువుల చికిత్సకు అవసరమైన మందులు లేవు, ఆధునిక పరికరాలు లేవు, ఉన్న భవనాలు శిథిలావస్థలో ఉండగా, వాటిని చూసుకునే సిబ్బంది కూడా లేకుండా శాఖను నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో పశుసంవర్ధక శాఖ ద్వారా మొత్తం 3176 కేంద్రాలు పనిచేస్తున్నప్పటికీ, గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వీటిలో చాలా కేంద్రాలు పేరుకే పరిమితమయ్యాయని మంత్రి పేర్కొన్నారు. రైతుల విరాళాలతో నిర్మించిన పాత భవనాలను కూడా సంరక్షించలేక, వాటిని శిథిలావస్థకు నెట్టారని ఆరోపించారు. వైసీపీ పాలనలో ఐదేళ్ల పాటు పశుసంవర్ధక శాఖకు నిధులు కేటాయించకుండా, మౌలిక సదుపాయాల అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని, ఫలితంగా పశువైద్యశాలలు మందుల్లేక, సిబ్బంది లేక, రైతులకు ఉపయోగపడని పరిస్థితిలోకి వెళ్లాయని మంత్రి అన్నారు.
*కూటమి ప్రభుత్వం వచ్చాకే పశుసంవర్ధక శాఖకు ఊపిరి*
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పరిస్థితిని సమీక్షించి, పశుసంవర్ధక శాఖ పునరుజ్జీవనానికి చర్యలు చేపట్టిందని మంత్రి తెలిపారు. శిథిలావస్థలో ఉన్న భవనాల స్థానంలో కొత్త భవనాల నిర్మాణానికి RIDF–NABARD / ESVHD నిధుల సహకారంతో ఇప్పటివరకు 485 భవనాలు నిర్మించామని వివరించారు. ఇంకా 826 పశుసంస్థలకు సంబంధించిన భవనాలు దయనీయ స్థితిలో ఉన్నాయని, వీటిలో 400 సంస్థలకు వెంటనే కొత్త భవనాలు అవసరం ఉండగా ఇందుకు రూ.265.10 కోట్లు, మరో 426 సంస్థలకు తక్షణ మరమ్మతుల కోసం రూ.37.40 కోట్లు అవసరమని మంత్రి వెల్లడించారు. ఈ అన్ని అవసరాలను దృష్టిలో పెట్టుకొని, 2026–27 నుంచి 2028–29 ఆర్థిక సంవత్సరాల మధ్య, RIDF–NABARD బడ్జెట్ కింద దశలవారీగా పశువైద్యశాలల భవనాల నిర్మాణం, మరమ్మతులు చేపట్టేందుకు ప్రభుత్వం స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తోందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలా శాఖలను నిర్వీర్యం చేయడం కాకుండా, రైతులు, పశుపాలకులకు వాస్తవంగా ఉపయోగపడే విధంగా పశుసంవర్ధక శాఖను బలోపేతం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.
*జారీ చేసిన వారు: పిఆర్వో – వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్థక, మత్స్యశాఖ మంత్రివర్యుల కార్యాలయం*




