
చిట్వేలి మన జనప్రగతి ఫిబ్రవరి 26:-సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి సైన్స్ సమగ్ర శిక్ష మహోత్సవం పోటీలకు చిట్వేలి పిఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారని ప్రధానోపాధ్యాయులు దుర్గరాజు తెలిపారు.పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుల సహకారంతో వివిధ విభాగాల కింద విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులను 23వ తేదీన ఆన్లైన్ విధానం ద్వారా సమర్పించగా ఏ.సుస్మిత,వి.దివ్యశ్రీ, ఆర్. కుషాల్ రూపొందించిన రాకెట్ మోడల్ ప్రాజెక్టు రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల దుర్గరాజు మాట్లాడుతూ… సైన్స్ సమగ్ర మహోత్సవం పోటీల ద్వారా విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్కోణం అభివృద్ధి చెందడం,రోజువారీ జీవితంలో శాస్త్రాన్ని ఎలా ఉపయోగించాలో అవగాహన పెరుగుతుందని అన్నారు.అనుభవాత్మక అభ్యసనంను ప్రోత్సహించడం ద్వారా విద్యార్థులలో స్వయంకృషి,పరిశోధనాత్మక దృక్కోణం అభివృద్ధి చెందుతుందని, జాతీయ విద్యా విధానం- 2020 లక్ష్యాల సాధనకు తోడ్పాటు,విద్యార్థుల ప్రతిభను సమాజం నేరుగా చూసే అవకాశం లభిస్తుందని తెలిపారు.పాఠశాలలలో ఆరోగ్యకరమైన పోటీ, సృజనాత్మకతకు ప్రోత్సహిస్తుందని, డిజిటల్ లిటరసీ & స్టెమ్ నైపుణ్యాలకు బలం చేకూరుస్తుందని అన్నారు.ప్రతిష్టాత్మకమైన ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ కవర్ పేజీ నందు ఆన్లైన్ ద్వారా విద్యార్థులు సమర్పించిన ప్రాజెక్టు ఫోటోలకు స్థానం దక్కడం పట్ల పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల సైన్సు ఉపాధ్యాయులు భాస్కర్ రెడ్డి,సోఫియా,కళావతి,సుహాసిని,సునీత కుమారి పాల్గొన్నారు.




