
వేముల మండలం పెర్న పాడు బుడ్డ శనిగ కొనుగోలు కేంద్రాన్ని రాజ్యసభ మాజీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ మీడియా చైర్మన్ తులసి రెడ్డి మంగళవారం కాంగ్రెస్ నాయకులతో కలిసి సందర్శించారు. రైతుల ఇబ్బందులను,సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తులసి రెడ్డి మాట్లాడుతూ రాయలసీమ, ప్రకాశం జిల్లాలలో రబీ సీజన్లోబుడ్డ శనిగ ప్రధాన పంట అని, దాదాపు రాష్ట్రంలో 12 లక్షల ఎకరాల్లో ఈ పంట వేస్తారని అన్నారు.ఈ సంవత్సరం దిగుబడి బాగా వచ్చింది. కానీ గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బంది పడ్డారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీసం మద్దతు ధర క్వింటాలకు 5875 రూపాయలు కాగా, మార్కెట్లో వ్యాపారులు 4700 రూపాయలకు కొన్నారు. దీనివలన రైతులు క్వింటాలకు దాదాపు వెయ్యి రూపాయలు చొప్పున నష్టపోయారు.ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు,మిగతా పార్టీలు,ప్రజా సంఘాలు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చాయి. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడుతో తులసి రెడ్డి ఫోన్లో మాట్లాడారు. ప్రభుత్వం జిల్లాలో 21 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం హర్షణీయమని తులసి రెడ్డి అన్నారు.ఒక్కొక్క ఎకరాకు ఏడు క్వింటాళ్లు చొప్పున మాత్రమే కొంటామని షరతు విధించడం సమంజసం కాదని, ఎన్ని క్వింటాళ్లు పండితే అన్ని క్వింటాళ్లు కొనుగోలు కేంద్రాల ద్వారా కొనాలని తులసిరెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రైతుల ఖాతాలో 15 రోజులకు డబ్బు జమ చేస్తామని ప్రభుత్వం చెబుతున్నదని దానిని వారానికి కుదించాలని విజ్ఞప్తి చేశారు. తేమశాతం, వ్యర్థ పదార్థాలు, దెబ్బతిన్న గింజలు, ఇలా రకరకాల షరతులతో రైతులను ఇబ్బంది పెట్టవద్దని తులసి రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వేముల మండల శాఖ అధ్యక్షుడు వెంకటేశు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు అమర్నాథ్ రెడ్డి, ఉత్తన్న, బండారు వెంకటేశు, నామా వినయ్, మండల వ్యవసాయ అధికారి ఓబులేసు, వ్యవసాయ ఎక్స్టెన్షన్ ఆఫీసురు సురేష్, మాజీ సర్పంచ్ రవిశంకర్ రెడ్డి, రైతులు రాఘవరెడ్డి,రామ్మోహన్ నాయుడు, రామాంజనేయరెడ్డి నరసింహారెడ్డి,చలపతి తదితరులు పాల్గొన్నారు.




