
పులివెందుల నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి
పులివెందుల అర్బన్ మన జనప్రగతి ఏప్రిల్ 23:పులివెందుల రైతుల సమస్యలపై కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి (బీటెక్ రవి) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.రాజకీయ ప్రయోజనాల కోసం రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.ఈ సందర్భంగా బీటెక్ రవి మాట్లాడుతూ 2019-24 మధ్య వైసిపి అధికారంలో ఉన్నప్పుడు పులివెందుల ప్రాంతానికి అదనంగా ఒక్క ఎకరాకైనా సాగునీరు ఇచ్చారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు బకాయిలు పెట్టారనే వంకతో రైతులకు డ్రిప్ మెటీరియల్ కూడా ఇవ్వకుండా అన్యాయం చేసింది అవినాష్ రెడ్డి కాదా అని నిలదీశారు.మీరు ఎంపీగా ఉండి కూడా పులివెందులకు మంజూరైన ఇప్పట్ల (2), మబ్బుచింతలపల్లె (3) మోటార్లను ఉప్పలూరు,కలుసపాడు ప్రాంతాలకు తరలించారు కాదా మీ నియోజకవర్గానికి అన్యాయం జరుగుతుంటే ఎంపీగా ఏం చేశారు అని ప్రశ్నించారు.ఎంపీ అవినాష్ రెడ్డికి ముందుచూపు లేకపోవడం వల్లే 2022లో రూ. 1.70 కోట్లుగా ఉన్న మెయింటెనెన్స్ అంచనా వ్యయం నేడు రూ. 4 కోట్లకు చేరిందని విమర్శించారు.పులివెందుల స్కీమ్స్లో అన్ని మోటార్లను ఒకేసారి నడపడం వల్ల విద్యుత్ లోటు,మోటార్లు కాలిపోయే ప్రమాదం ఉంటుందని అందుకే అధికారులు ప్రాధాన్యత క్రమంలో నీటిని విడుదల చేస్తున్నారని వివరించారు.రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఈ సమస్యను వాడుకోవడం సరికాదని హితవు పలికారు.షర్మిలమ్మ చెప్పినట్లు గొడ్డలితో రక్తం పారించినట్లు కాకుండా,మీ అక్రమ సంపాదనలో ఆ నాలుగు కోట్లు ఖర్చు పెట్టి నీళ్లు పారించండి మేము మనస్ఫూర్తిగా అభినందిస్తాం అని ఎద్దేవా చేశారు.గతంలో అంకాలమ్మ గూడూరు రైతుల కోసం తాను సొంతంగా 15 లక్షలు ఖర్చు చేశానని మంచి పనులకు తెలుగుదేశం అడ్డుపడదని స్పష్టం చేశారు.లింగాల మండలంలోని కొమ్మనూతల,తాతిరెడ్డిపల్లె, మురారి చింతల తదితర ప్రాంతాల రైతులకు ఒక వారంలోగా నీటి సమస్యను పరిష్కరించి సాగునీరు అందిస్తామని బీటెక్ రవి భరోసా ఇచ్చారు.అనంతరం భూమయ్యగారిపల్లి ప్రాంత సమస్యలపై దృష్టి సారిస్తామని పేర్కొన్నారు.




