
మాదిగ వాడ పై చిన్న చూపు తగదు
తక్షణమే అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి
ప్రొద్దుటూరు మన జనప్రగతి ఫిబ్రవరి 26 :-
ప్రొద్దుటూరు పురపాలక సంఘం పరిధిలోని మోడంపల్లి మాదిగ వాడ పై అగ్రవర్ణాలు మరియు కొంతమంది చిన్నచూపు చూస్తున్నారని అలాంటి వారిపై తక్షణమే అధికారులు చర్యలు తీసుకోవాలని ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి సుధాకర్ మాదిగ డిమాండ్ చేశారు. గురువారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలో ఉన్న 16 వ వార్డు మోడంపల్లి మాదిగ వాడ లో ఎన్నో సంవత్సరాలుగా పారిశుద్ధ్యం సరిగా లేకపోవడం వల్ల మురుగు నీరు వీధుల గుండా ప్రవహిస్తుంది అని తెలిపారు. వాడలో అందరూ మాదిగ కులస్థులు ఉండటం వల్ల సంబంధిత అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. వీధులలో పందుల సంచారం, కుక్కల బెడద అధికంగా ఉందన్నారు. సరిగ్గా రోడ్డు లేదని దానికి తోడు మురుగు నీరు, వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోయి అధ్వాన్నంగా తయారైంది అన్నారు. సోమవారం కడప కలెక్టరేట్ లో పిజిఆర్ఎస్ ద్వారా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశామని వివరించారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు కొత్తపల్లి యల్లయ్య, నాగేశ్వరరావు, పూజారి పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు.




