
సింహాద్రిపురం మన జనప్రగతి ఫిబ్రవరి 27: మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో పారిశుధ్యాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో మార్చి 1వ తేదీ నుండి స్వచ్ఛ రథం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారి (MPDO) పి.శ్రీనివాస రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం,ఈ రథం ద్వారా ప్రతి గ్రామంలోని గృహాల నుండి పొడి వ్యర్థాలను సేకరించి,నిబంధనల మేరకు ప్రజలకు అవసరమైన సరుకులను అందజేయడం జరుగుతుందని,ఈ కార్యక్రమం మార్చి 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు.గృహాల నుండి పొడి వ్యర్థాల సేకరణ మరియు అవగాహన లక్ష్యంగా,గ్రామ పంచాయతీ కార్యదర్శులు మరియు ప్రజా ప్రతినిధుల పర్యవేక్షణలో ఈ స్వచ్ఛరథం కార్యక్రమం నిర్వహించబడుతుందని,గ్రామస్తులందరూ తమ ఇళ్లలోని పొడి వ్యర్థాలను స్వచ్ఛ రథానికి అప్పగించి,ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎంపీడీఓ కోరారు.రథం వచ్చే ముందు రోజు గ్రామాల్లో చాటింపు (దండోరా) ద్వారా ప్రజలకు సమాచారం అందించాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో సర్పంచులు, ఎంపీటీసీలు,సచివాలయ సిబ్బంది చురుగ్గా పాల్గొనాలని తెలియజేశారు.




