
పులివెందుల అర్బన్ మన జన ప్రగతి ఫిబ్రవరి 23:
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేటి నుంచి రెండు రోజుల పాటు తన సొంత నియోజకవర్గమైన పులివెందులలో పర్యటించనున్నారు.జగన్ పర్యటన నేపథ్యంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇప్పటికే నియోజకవర్గంలో పర్యటించి అన్ని ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు.
షెడ్యూల్ ప్రకారం జగన్ మోహన్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం బెంగళూరు నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి పులివెందులకు చేరుకుంటారు.ఈ రాత్రికి ఆయన పులివెందులలోనే బస చేస్తారు.పర్యటనలో భాగంగా క్యాంప్ కార్యాలయంలో నిర్వహించే ‘ప్రజా దర్బార్’ ద్వారా స్థానిక ప్రజల నుంచి వినతులు స్వీకరించి,వారి సమస్యలను అడిగి తెలుసుకునే అవకాశం ఉంది.
పర్యటనలో రెండో రోజైన ఫిబ్రవరి 25 (బుధవారం) ఉదయం జగన్ పులివెందుల నుంచి రోడ్డు మార్గం ద్వారా వేంపల్లె మండలం నందిపల్లె గ్రామానికి చేరుకుంటారు.అక్కడ నూతనంగా నిర్మించిన శ్రీ నందీశ్వర ఆలయ ప్రతిష్ఠా మహోత్సవంలో పాల్గొని, ఆలయాన్ని ప్రారంభించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో జగన్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.రాబోయే స్థానిక సంస్థలు మరియు మున్సిపల్ ఎన్నికల వ్యూహాలపై పార్టీ కీలక నేతలు, కార్యకర్తలతో ఆయన సుదీర్ఘంగా చర్చించనున్నారు. ముఖ్యంగా పార్టీ మారుతున్న నేతల ప్రభావం పడకుండా,సర్పంచులు, ఎంపీటీసీలు మరియు జెడ్పీటీసీ సభ్యులకు ధైర్యం చెప్పి,ఎన్నికలకు సిద్ధం చేయడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది.




