
నెలల వ్యవధిలోనే వరుస అవినీతి కేసులతో పలువురు అధికారులు పట్టుబడిన వైనం.
సింహాద్రిపురం మన జనప్రగతి ఫిబ్రవరి 23:-కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురంలో సంచలనం రేకెత్తిస్తూ ఏసీబీ అధికారులు సోమవారం మెరుపు దాడులు నిర్వహించారు.సింహాద్రిపురం పోలీస్ స్టేషన్లో లంచం తీసుకుంటూ పులివెందుల రూరల్ సీఐ ఎన్.వి.రమణ,ఎస్ఐ అనిల్ కుమార్లు ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు.ఏసీబీ డీఎస్పీ సీతారామారావు వెల్లడించిన వివరాల ప్రకారం,అనంతపురానికి చెందిన బ్రహ్మం అనే వ్యక్తి ఆటో కన్సల్టెన్సీ వ్యాపారం నిర్వహిస్తున్నాడు.గత డిసెంబర్ నెలలో అతను ఒక బైక్ను బీహార్కు చెందిన దిలీప్ అనే వ్యక్తికి విక్రయించాడు.అయితే,ఆ దిలీప్ అనే వ్యక్తి పులివెందుల,సింహాద్రిపురం పరిసర ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్ నేరాలకు పాల్పడ్డాడు.ఆ నేరాల్లో బ్రహ్మం విక్రయించిన బైక్నే వాడినట్లు సీసీ టీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు గుర్తించారు అని,దీనిని సాకుగా తీసుకున్న రూరల్ సీఐ రమణ,ఎస్ఐ అనిల్ కుమార్లు ఆ బైక్ బ్రహ్మం అమ్మినదే కాబట్టి ఆ నేరంతో అతనికి కూడా సంబంధం ఉందని చిత్రీకరించారు.కేసులో ఇరికించి రిమాండ్కు పంపిస్తామని బెదిరిస్తూ తొలుత రూ.7 లక్షలు డిమాండ్ చేశారని,బాధితుడు అంత మొత్తం ఇవ్వలేనని ప్రాధేయపడటంతో చివరికి రూ.2 లక్షలకు ఒప్పందం కుదిరించుకొని మొదటి విడతగా రూ.50 వేలు తీసుకున్న అధికారులు,మిగిలిన రూ.1.50 లక్షలను సోమవారం ఇవ్వాలని బాధితుడిని ఆదేశించారు.దీంతో బ్రహ్మం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.ఏసీబీ అధికారుల సూచనల మేరకు సోమవారం సింహాద్రిపురం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ అనిల్ కుమార్ ఆ నగదును స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.ఈ అక్రమ వసూళ్లలో కీలక పాత్ర పోషించిన రూరల్ సీఐ ఎన్.వి.రమణను కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు.ప్రస్తుతం ఇద్దరు అధికారులపై కేసు నమోదు చేశామని,విచారణ అనంతరం వారిని రిమాండ్కు తరలిస్తామని ఏసీబీ అధికారులు వెల్లడించారు.ఈ ఏసీబీ డిఎస్పి సీతారామారావు మాట్లాడుతూ ఫిర్యాదు చేసిన బాధితులకు ఏసీబీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని,ముద్దాయీల నుంచి వారికి ఎలాంటి సమస్యలు రాకుండా చూస్తామని డీఎస్పీ భరోసా ఇచ్చారు.ఈ కేసులో ఇతర ఉన్నతాధికారుల ప్రమేయంపై కూడా విచారణ జరుపుతున్నామని,ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.ఏది ఏమైనా నెలల వ్యవధిలోనే వరుస అవినీతి కేసులతో పలు డిపార్ట్మెంట్ అధికారులు పట్టుబడి తమకు చెరగని మరకలను ముద్రించుకున్న వారయ్యారు.




