
మన జన ప్రగతి ఫిబ్రవరి 25: గ్రామీణ ప్రాంతాలలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు చల్లటి మంచినీటి వసతి కల్పించడానికి నాంది పలికిన చిట్వేల్ హెల్ప్ లైన్ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులకు చిట్వేలి మంగళ విద్యాశాఖ అధికారి ఖాజా మొహిదీన్ అభినందనలు తెలియజేశారు. చిట్వేల్ హెల్ప్ లైన్ సొసైటీ సభ్యులు బుధవారం చిట్వేలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చల్లటి త్రాగునీటి యంత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ చిట్వేలిలో పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి అన్ని ప్రభుత్వ పాఠశాలలు సందర్శిస్తున్న సందర్భంలో గ్రామీణ ప్రాంతాలలో విద్యాభివృద్ధి కొరకు చిట్వేలు మండలంలోని యువతతో కలసి సిహెచ్ఎస్ సంస్థ స్థాపించి చేస్తున్న సేవాభివృద్ధి కార్యక్రమాలు, పాఠశాలలో నీటి యంత్రాలు, పరీక్షలలో ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు, విశేష దినాలలో విద్యా సామాగ్రి, విద్యార్థులలో క్రీడా స్ఫూర్తి పెంపొందించే దిశగా కృషి చేస్తుండడం అభినందనీయం అన్నారు. క్రీడా మైదానం పునరుద్ధరణ, స్పోర్ట్స్ కిట్, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు చదువు పరంగా, ఆటల పరంగా ఆర్థిక సహాయం చేయడం సంతోషించదగ్గ విషయం అన్నారు. మారుమూల గ్రామాలలో నూతన పాఠశాల భవన నిర్మాణానికి ఏర్పాటు చేయడం తదితర సేవా కార్యక్రమాలు చూసి చాలా స్ఫూర్తి దాయకంగా ఉందని ఇలాంటి సేవా సంస్థలు సమాజానికి ఆదర్శం అని అన్నారు. సిహెచ్ఎస్ సంస్థ సభ్యులకు, దాతలకు ఎంఈఓ కృతజ్ఞతలు తెలియజేశారు.




